రంగంలోకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బంది.. 28 మందితో ప్రత్యేక బృందాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు.. అక్రమాలు తేలితే క్రిమినల్ కేసులు
హైదరాబాద్, ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రభుత్వానికి బియ్యం అప్పగించడంలో విఫలమైన మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం
కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. సాధారణ తనిఖీలకు భిన్నంగా
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది పోలీసు సిబ్బందితో
ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. రాష్ట్రవ్యాప్తంగా మిల్లులపై ఆకస్మిక
తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
సివిల్ సప్లైస్లోకి ‘స్పెషల్ టీమ్స్’
గ్రేహౌండ్స్, ఆక్టోపస్కు చెందిన 28 మంది పోలీసు సిబ్బందిని సివిల్ సప్లైస్ శాఖ
ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ విభాగానికి అనుసంధానించారు. వీరు ఇకపై
ప్రత్యేక టాస్క్ టీమ్లుగా పనిచేయనున్నారు.
సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం
సివిల్ సప్లైస్ భవన్లో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మిల్లర్ల తనిఖీలు,
ప్రభుత్వ బియ్యం నిల్వలు, అప్పగింతలు, నిబంధనల ఉల్లంఘనలపై క్షేత్రస్థాయిలో
కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
మూడు రోజుల ప్రత్యేక శిక్షణ
సివిల్ సప్లైస్ కార్యకలాపాలు, నిత్యావసర వస్తువుల చట్టాలు, తనిఖీలు, కేసుల నమోదు,
ఎన్ఫోర్స్మెంట్ విధానాలపై ప్రత్యేక బృందాలకు
తెలంగాణ పోలీస్ అకాడమీలో మూడు రోజుల శిక్షణ ఇచ్చారు.
తమకు అలవాటైన వ్యూహాత్మక ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీల అనుభవాన్ని ఇప్పుడు
మిల్లర్ల తనిఖీల్లో ఉపయోగించనున్నారు.
154 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో
154 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది.
ఈ నేపథ్యంలో మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం, ధాన్యం నిల్వలు,
ఇతర ప్రభుత్వ బకాయిలపై సివిల్ సప్లైస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.
అక్రమాలు తేలితే క్రిమినల్ కేసులే!
ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం లేదా ఇతర బాధ్యతల్లో మిల్లర్లు విఫలమైతే
ఇక ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం, బకాయిలు, నిబంధనల ఉల్లంఘనలపై
‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని తెలిపారు.
మిల్లర్లపై సర్కార్ స్పెషల్ ఫోకస్!
గ్రేహౌండ్స్, ఆక్టోపస్ రంగంలోకి..
అక్రమాలు తేలితే కేసులే!
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలు తక్షణమే రంగంలోకి దిగడంతో బియ్యం మిల్లర్ల తనిఖీలు
మరింత కఠినతరం కానున్నాయి. తనిఖీల్లో వెలుగుచూసే ఉల్లంఘనల ఆధారంగా తదుపరి చర్యలు
తీసుకోనున్నారు.

