📄 ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కొండా సురేఖకు పదవి గండం?

కొండా సురేఖకు పదవి గండం?

ఖర్గే సీరియస్‌ అయిన విషయం తెలిసిందే.. ఇప్పుడు సీఎం రేవంత్‌ క్లియర్‌ మెసేజ్‌

ఎమ్మెల్యేల బలప్రదర్శన.. క్రమశిక్షణ కమిటీపై సీఎం వ్యాఖ్యలు.. డిప్యూటేషన్ల రద్దుతో మరింత ఆసక్తి

హైదరాబాద్‌, ఆగస్టు 24 (నవజ్యోతి ప్రతినిధి):
మంత్రి కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో రోజురోజుకూ
కొత్త మలుపు తిరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్‌
అయిన విషయం ఇప్పటికే తెలిసిందే.
తాజాగా ఈ వ్యవహారంపై సీఎం
రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన చుట్టూ ఎమ్మెల్యేల హాజరు,
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైఖరి, సురేఖకు
తెలియకుండానే అటవీశాఖలో డిప్యూటేషన్లు రద్దయ్యాయన్న పరిణామాలు కొత్త చర్చకు
దారితీశాయి.

ఇవన్నీ కలిపి చూస్తే.. కొండా సురేఖకు పార్టీ నుంచి వచ్చిన మెసేజ్‌ ఏంటి?
మంత్రి పదవిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది?
అనే ప్రశ్నలు
రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.

సీఎం వ్యాఖ్యల్లోనే అసలు క్లారిటీ?

ఈరోజు మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. కొండా సురేఖ వ్యవహారం
క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని స్పష్టం చేశారు. పార్టీ
అంతర్గత అంశాలపై తాను ఎక్కువగా మాట్లాడబోనని, కమిటీ నిర్ణయమే కీలకమని
చెప్పడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

మంత్రి సురేఖకు బహిరంగంగా మద్దతుగా నిలవకుండా.. వ్యవహారాన్ని క్రమశిక్షణ
కమిటీ పరిధిలోనే ఉంచడం ద్వారా సీఎం ఒక స్పష్టమైన రాజకీయ సందేశం ఇచ్చారా?
అన్న చర్చ మొదలైంది.

“పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎవరైనా ఒక్కటే.. నిర్ణయం కమిటీదే” అనే లైన్‌ను
సీఎం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం చుట్టూ ఎమ్మెల్యేల బలప్రదర్శన?

మరోవైపు ఈరోజు సీఎం నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు మంత్రులు,
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆయనతో కలిసి కనిపించడం కూడా రాజకీయంగా
చర్చనీయాంశమైంది.

ఇది సాధారణ సమావేశమే అయినప్పటికీ.. సురేఖ వ్యవహారం, ఎమ్మెల్యేల నుంచి
వస్తున్న వ్యతిరేకత, ఖర్గే అసంతృప్తి నేపథ్యంలో సీఎం వెంట భారీగా ఎమ్మెల్యేలు
కనిపించడం ఒక రాజకీయ మెసేజ్‌గానే చూడాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

అంటే.. వ్యక్తిగతంగా ఎవరి మీదా వ్యాఖ్యలు చేయకుండా
“సీఎం వైపు పార్టీ ఎమ్మెల్యేల బలం ఉంది” అనే సంకేతాన్ని
చూపించారా? అన్నది ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ.

మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైఖరి కూడా కీలకం

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా సురేఖ వ్యవహారంపై పార్టీ
క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా మాట్లాడటం గమనించాల్సిన అంశంగా మారింది.

ఒకవైపు ఖర్గే స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనట్లు వార్తలు రావడం.. మరోవైపు
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా క్రమశిక్షణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం..
ఇంకోవైపు సీఎం కమిటీ నిర్ణయమే కీలకమని చెప్పడం.. మూడు స్థాయిల్లో
ఒకే లైన్‌ కనిపిస్తోందా?
అనే చర్చకు దారితీస్తోంది.

సురేఖకు తెలియకుండానే డిప్యూటేషన్లు రద్దు?

ఇక అటవీశాఖలో చోటుచేసుకున్న మరో పరిణామం ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతోంది.
సురేఖకు తెలియకుండానే పలువురు అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేసినట్లు
వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

శాఖాపరమైన నిర్ణయాలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమే అయినా.. మంత్రి
కేంద్రంగా రాజకీయ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఈ నిర్ణయం రావడం
ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కేవలం పరిపాలనా నిర్ణయమేనా?
లేక సురేఖకు ఉన్న శాఖాపరమైన వ్యవహారాలపై క్రమంగా నియంత్రణ మారుతోందా?
లేదా రాబోయే మార్పులకు ఇది ముందస్తు సంకేతమా?

కేబినెట్‌ ప్రక్షాళన జరిగితే?

తెలంగాణ కేబినెట్‌లో మార్పులు, కొత్త ముఖాలకు అవకాశం వంటి అంశాలపై ఇప్పటికే
రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొండా సురేఖ వివాదం
తారస్థాయికి చేరడం.. పార్టీ అధిష్ఠానం అసంతృప్తి.. సొంత పార్టీ నేతల నుంచి
విమర్శలు.. సీఎం క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రస్తావించడం వంటి పరిణామాలు
చోటుచేసుకోవడంతో “కేబినెట్‌ ప్రక్షాళన జరిగితే సురేఖకు చోటుంటుందా?”
అనే ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది.

ఒకవేళ మార్పులు జరిగితే.. సీఎంకు రాజకీయంగా సన్నిహితంగా ఉన్న నేతలకు
ప్రాధాన్యం పెరుగుతుందా? కొత్త సామాజిక సమీకరణాలతో కొత్త ముఖాలను
తీసుకొస్తారా?
అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

క్లియర్‌ మెసేజ్‌ వచ్చేసిందా?

ఖర్గే సీరియస్‌ అయిన విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఇప్పుడు సీఎం వ్యాఖ్యలు,
మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వైఖరి, ఎమ్మెల్యేల సమీకరణం, శాఖలో తాజా పరిపాలనా
నిర్ణయాలను కలిపి చూస్తే కాంగ్రెస్‌ నుంచి
“పార్టీ క్రమశిక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదు” అనే
మెసేజ్‌ మాత్రం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలనే తుది నిర్ణయం
తీసుకున్నట్లు ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు.

అసలు ప్రశ్న ఇదే!

ఖర్గే అసంతృప్తి తర్వాత కూడా సురేఖకు మరో అవకాశం ఇస్తారా?
క్రమశిక్షణ కమిటీ ఏ నిర్ణయం తీసుకోబోతోంది?
కేబినెట్‌ ప్రక్షాళన వస్తే సురేఖ కొనసాగుతారా?
లేక సీఎం రేవంత్‌ కొత్త టీమ్‌లో కొత్త ముఖాలకు చోటు కల్పిస్తారా?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్‌ కంటే..
దాని వెనుక జరగబోయే రాజకీయ పునర్వ్యవస్థీకరణపైనే ఆసక్తి పెరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!