కామారెడ్డి, ఆగస్టు 31 (నవజ్యోతి ప్రతినిధి):
గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని కామారెడ్డి ఎస్పీ ఎం. రాజేష్చంద్ర సూచించారు. కామారెడ్డి కళాభారతి ప్రాంగణంలో ఉత్సవాల భద్రతపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
మండపాల ఏర్పాటు నుంచి విగ్రహాల నిమజ్జనం వరకు నిర్వాహకులు భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. ప్రజా రవాణా, అత్యవసర వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
మండపాల వద్ద భద్రతే ముఖ్యం
దొంగతనాల నివారణకు మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రాత్రివేళ కాపలా ఉంచాలని ఎస్పీ సూచించారు. విద్యుత్, సౌండ్ సిస్టంలను నిపుణులతో ఏర్పాటు చేయించుకోవాలని, అగ్నిప్రమాదాల నివారణకు ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, నీటి బకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు.
మండపాల ఏర్పాటుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, అత్యవసర వాహనాలు వెళ్లేందుకు మార్గం ఉండేలా చూడాలని సూచించారు.
విద్యుత్ తీగలపై అప్రమత్తత
విగ్రహాల తరలింపు సమయంలో విగ్రహం ఎత్తు, వాహనం ఎత్తు, మార్గంలోని విద్యుత్ తీగలను ముందుగానే పరిశీలించాలని ఎస్పీ సూచించారు. గతేడాది విద్యుత్ తీగల కారణంగా జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
డీజేలు, మద్యం, పేకాటకు నో
ఉత్సవాల్లో డీజేలు, మద్యం, పేకాట, అసభ్య కార్యక్రమాలకు తావివ్వొద్దని ఎస్పీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.
అధికారుల సమన్వయంతో ఉత్సవాలు
సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

