రూ.30 లక్షలకు విక్రయించేందుకు యత్నం.. కారులో తరలిస్తుండగా వాసాయి క్రైమ్ బ్రాంచ్ దాడి…
ముంబై, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): మహారాష్ట్రలో నకిలీ కరెన్సీ ముఠా గుట్టును వాసాయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. ముంబై సమీపంలోని విరార్ వద్ద కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని రూ.కోటి విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.
ముంబై–అహ్మదాబాద్ హైవేపై కారులో నకిలీ నోట్లను తరలిస్తుండగా క్రైమ్ బ్రాంచ్ అధికారులు పట్టుకున్నారు. కారులో రూ.500 విలువ కలిగిన 20,000 నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి ముఖ విలువ రూ.కోటి కాగా.. రూ.30 లక్షలకు విక్రయించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
కోపర్గావ్కు చెందిన ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిసింది. నకిలీ నోట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు తయారు చేశారు? ఎక్కడ, ఎవరికి చలామణి చేసేందుకు ప్రయత్నించారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా నకిలీ కరెన్సీ సరఫరా నెట్వర్క్, తయారీ కేంద్రాలు, కొనుగోలుదారుల వివరాలను ఆరా తీస్తున్నారు.
ముంబైలో ఇంత పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపింది. రూ.కోటి విలువైన నకిలీ నోట్లను రూ.30 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించడం చూస్తే.. భారీగా నకిలీ కరెన్సీని మార్కెట్లోకి చొప్పించేందుకు ముఠా సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

