విద్యార్థులకు నోట్బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు అందించిన ఉపాధ్యాయుడు ప్రసాద్,…
సంగారెడ్డి, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):
సంగారెడ్డి మండలం కల్వకుంట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు ప్రసాద్ తన సేవా దృక్పథంతో విద్యార్థులందరికీ నోట్బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లతో కూడిన కిట్లను స్వయంగా అందజేశారు. విద్యార్థుల చదువుకు అవసరమైన సామగ్రిని అందించడం పట్ల పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఎవరూ వెనుకబడకుండా కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవడం, రాయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిరంతర సాధనతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రీనా, ఉపాధ్యాయులు గోరక్నాథ్, నీలావతి పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ప్రసాద్ చేపట్టిన కార్యక్రమాన్ని వారు అభినందించారు. స్టేషనరీ కిట్లు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేయగా, ప్రసాద్ సేవాభావాన్ని తల్లిదండ్రులు ప్రశంసించారు.

