జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో మెకానిక్ దుర్మరణం..
కుత్బుల్లాపూర్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాదం చోటుచేసుకుంది. బస్సుకు బ్రేక్ సెట్టింగ్ చేస్తుండగా మెకానిక్ సంతోష్ (37) బస్సు టైరు కిందపడి మృతి చెందాడు. తోటి ఉద్యోగుల వివరాల ప్రకారం.. బస్సు కింద పనిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా వాహనం కదలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
తీవ్రంగా గాయపడిన సంతోష్ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో డిపోలో తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.
బస్సు కింద మెకానిక్ పనులు చేస్తున్న సమయంలో వాహనం కదలడానికి కారణమేంటి? మరమ్మతుల సమయంలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నారా? బ్రేక్ సెట్టింగ్లో నిర్దేశిత భద్రతా విధానాలు పాటించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదానికి అసలు కారణం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధ్యత ఎవరిది అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

