కుత్బుల్లాపూర్, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రతినిధి):
పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాల్సిన చోట.. వారి కాళ్ల కింద విషసర్పాల భయం!
దుండిగల్ సర్కిల్ బౌరంపేట ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య లోపాలు
విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. చెత్త కుప్పలు, పెరిగిన
ముళ్లపొదలు, పచ్చగడ్డి మధ్య వరుసగా పాములు ప్రత్యక్షమవుతుండటంతో
పాఠశాలలో భయాందోళన నెలకొంది. పింజరపాము, నాగుపాము కనిపించడంతో పాటు
విద్యార్థులు విప్పి ఉంచిన షూలోకి పాము దూరిన ఘటన మరింత కలవరపెడుతోంది.
ఉపాధ్యాయులు సకాలంలో గుర్తించడంతో ప్రమాదం తప్పింది.
ఫిర్యాదు.. స్పందన కోసం ఎదురుచూపు!
పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు మున్సిపల్ అధికారులకు
నేరుగా సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు తగిన చర్యలు చేపట్టలేదని
ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన సమస్యపై కూడా
అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పారిశుద్ధ్యం ఎక్కడ?
బౌరంపేట ప్రధాన రహదారుల వెంట ఎక్కడికక్కడ పెరిగిన గడ్డి, పేరుకుపోయిన
చెత్తతో దోమలు, పాములు, విషపురుగులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని
స్థానికులు చెబుతున్నారు. పాఠశాల వెనుక భాగంలోని చెత్త కుప్పలను
తొలగించడంతో పాటు బౌరంపేట బొడ్రాయి నుంచి భ్రమరాంబ గుడి, మల్లన్న గుడి
వరకు రోడ్డుపక్కన పేరుకుపోయిన చెత్త, గడ్డిని వెంటనే తొలగించాలని
బౌరంపేట డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పీసరి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ఆయన కోరారు.

