రామాయంపేట,ఆగస్టు 22 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్):
దోమల నివారణకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ప్రత్యేక చర్యలు చేపట్టారు.రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలో సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధులు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ఫాగింగ్ స్ప్రే నిర్వహించారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ పేర్కొన్నారు. దోమల వృద్ధికి అనుకూల పరిస్థితులు లేకుండా గ్రామపంచాయతీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని,పాత టైర్లు, కొబ్బరి చిప్పలు,ఇతర వస్తువుల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించి సీజనల్ వ్యాధుల నివారణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ కోరారు.

