టెండన్ పూర్తిగా విడిపోవడంతో ఆరు వారాల విశ్రాంతి.. షూటింగ్లకు బ్రేక్…
ప్రముఖ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్ సందర్భంగా తుంటి భాగంలోని (హిప్) టెండన్ పూర్తిగా విడిపోయే తీవ్ర గాయానికి గురయ్యారు. ఓ హై ఎనర్జీ డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
వైద్యుల పరీక్షల అనంతరం రష్మికకు ఆరు వారాల పాటు పూర్తి విశ్రాంతితో పాటు ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ చికిత్స అవసరమని సూచించారు. ఈ కారణంగా ఆమె నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలు రణబాలి, మైసా షూటింగ్లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ గాయంపై స్పందించిన రష్మిక, “ఇది నిజమే… ప్రస్తుతం కోలుకుంటున్నాను. నా గురించి ఆరా తీసిన అందరికీ ధన్యవాదాలు” అని తెలిపారు.
వైద్య నిపుణుల ప్రకారం తుంటి భాగంలోని టెండన్ పూర్తిగా విడిపోయే గాయం నటీనటుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా తీవ్ర శారీరక శ్రమ చేసే ప్రొఫెషనల్ క్రీడాకారుల్లో ఇలాంటి గాయాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. పూర్తిగా కోలుకోవడానికి కచ్చితమైన విశ్రాంతి, పునరావాస చికిత్స తప్పనిసరిగా అవసరమని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్ల సందర్భంగా ప్రముఖ నటీనటులు గాయపడిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకర యాక్షన్, డ్యాన్స్ సన్నివేశాలను డూప్ లేకుండా చేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

