గుర్జకుంట–బస్వాపూర్ శివారులో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం.. కాపర్ వైర్ల చోరీతో అన్నదాతల్లో ఆందోళన
భిక్కనూరు, ఆగస్టు 1 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూరు మండలంలోని గుర్జకుంట–బస్వాపూర్ శివారులో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి నాలుగు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన కాపర్ వైర్లను అపహరించారు. దీంతో సాగునీటి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే ప్రాంతంలో గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఇదే తరహా చోరీలు జరగడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాలు కురిసి నాట్లు వేస్తూ పంటలపై ఆశలు పెట్టుకున్న సమయంలో ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతుండడం బాధాకరంగా మారింది.
ఈ ఘటనపై గుర్జకుంట గ్రామ సర్పంచ్ సంతోష్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో పలుమార్లు ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించడం అత్యంత దురదృష్టకరం. వర్షాలతో రైతులు నాట్లు వేసి మంచి పంటపై ఆశలు పెట్టుకున్న వేళ ఇలాంటి ఘటనలు జరగడం వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది. కొద్దిపాటి కాపర్ కోసం రైతుల కష్టాన్ని నాశనం చేయడం అమానుషం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని కోరారు.

