కుత్బుల్లాపూర్, జూలై 29: (నవజ్యోతి ప్రతినిధి) గురువు పట్ల కృతజ్ఞత, యోగం ద్వారా వ్యక్తిత్వ వికాసం, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా సుచిత్రలోని శివోహం యోగా సెంటర్లో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురు-శిష్య బంధానికి ప్రతీకగా జరిగిన ఈ కార్యక్రమంలో యోగ సాధకులు భక్తిశ్రద్ధలతో పాల్గొని గురువులకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా యోగా గురువు రవీందర్ రాజు మాట్లాడుతూ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగం కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి మార్గదర్శకమని అన్నారు. గురువు చూపిన మార్గంలో క్రమశిక్షణతో సాధన చేస్తే జీవితం పరిపూర్ణత వైపు పయనిస్తుందని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతిలో గురువుకు దైవంతో సమానమైన స్థానం ఉందని, గురుపూర్ణిమ అనేది గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పవిత్రమైన సందర్భంగా అభివర్ణించారు. అనంతరం విద్యార్థులు గురువులను శాలువాలతో సత్కరించి ఆశీర్వాదాలు పొందారు.
ఆధ్యాత్మిక విలువలు, గురుభక్తి, యోగ సాధన ప్రాధాన్యతను సమాజానికి చాటిచెప్పిన ఈ వేడుకలు పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపాయి.

