రామాయంపేట రెవెన్యూ డివిజన్ను వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించి, అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించాలని ఉద్యమ నాయకురాలు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. ఐదు నెలల పాటు నిరాహార దీక్షలు చేసి సాధించుకున్న రెవెన్యూ డివిజన్ ప్రస్తుతం పూర్తిస్థాయి వ్యవస్థ లేక అలంకారప్రాయంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు నెలల ఉద్యమంతో డివిజన్
రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం తీవ్ర ఎండలు, భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా ఐదు నెలల పాటు నిరాహార దీక్షలు చేపట్టి ఉద్యమం కొనసాగించినట్లు అశ్విని శ్రీనివాస్ తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీతో పాటు రామాయంపేట పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు, కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకుల మద్దతుతో ఉద్యమం సాగిందని ఆమె పేర్కొన్నారు.
ప్రకటన జరిగింది.. కానీ పూర్తిస్థాయి ఏర్పాట్లు ఏవీ?
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో మెదక్ నడిబొడ్డున రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటింపజేశామని అశ్విని శ్రీనివాస్ గుర్తుచేశారు.
అనంతరం తాత్కాలిక ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసి, తూప్రాన్ ఆర్డీఓకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ.. పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది, గెజిట్ తదితర ప్రక్రియలు పూర్తికాకపోవడంతో ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదని ఆమె అన్నారు.
పూర్తిస్థాయి ఆర్డీఓను నియమించాలి
చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించేందుకు రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని వెంటనే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని అశ్విని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
పూర్తిస్థాయి ఆర్డీఓతో పాటు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించి ప్రజలకు రెవెన్యూ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
మైనంపల్లి హామీ ఏమైంది?
రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఉద్యమ సమయంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు తనకు మద్దతుగా నిలిచి నిరాహార దీక్షలో పాల్గొన్నారని అశ్విని శ్రీనివాస్ తెలిపారు.
డివిజన్ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తిస్థాయి సహకారం అందిస్తానని, ప్రభుత్వం మెడలు వంచి డివిజన్ ఏర్పాటు చేయిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు.
హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి
ప్రస్తుతం మైనంపల్లి రోహిత్రావే ఎమ్మెల్యేగా ఉన్నందున గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అశ్విని శ్రీనివాస్ కోరారు.
రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇది ఒక్కరి కోరిక కాదని.. రామాయంపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల ఆకాంక్ష అని అశ్విని శ్రీనివాస్ పేర్కొన్నారు.

