ఇల్లు అద్దెకు కావాలంటూ ప్రవేశం.. మంచినీళ్లు అడిగి మాటల్లోకి దింపి చైన్ లాక్కెళ్లిన దుండగుడు
మాడుగులపల్లి, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
మాడుగులపల్లి మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం వృద్ధురాలి మెడలోని బంగారు మంగళసూత్రాన్ని
గుర్తుతెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన
కుందూరు వసంతమ్మ (సుమారు 70 ఏళ్లు) ఇంట్లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇల్లు అద్దెకు కావాలంటూ..
సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వసంతమ్మ ఇంటికి వచ్చాడు.
ఇల్లు అద్దెకు కావాలని, ఇల్లు చూసుకుంటానంటూ ఇంట్లోకి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు.
అనంతరం మంచినీళ్లు ఇవ్వాలని కోరడంతో వసంతమ్మ వంటగదిలోకి వెళ్లింది.
ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి ఆమె మెడలో ఉన్న సుమారు
3 తులాల బంగారు మంగళసూత్రాన్ని లాక్కునేందుకు ప్రయత్నించాడు.
వసంతమ్మ గట్టిగా గొలుసును పట్టుకోవడంతో అది సగం తెగిపోయింది.
సుమారు ఒక తులం బంగారం అపహరణ
గొలుసు తెగిపోవడంతో అందులోని సుమారు ఒక తులం బంగారు భాగాన్ని
తీసుకున్న నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఘటన అనంతరం బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
సీసీ కెమెరాలపై పోలీసుల దృష్టి
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గుర్తుతెలియని వ్యక్తి కోసం దర్యాప్తు చేపట్టారు.
గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వృద్ధురాలిని మాటల్లో మభ్యపెట్టి ఇంట్లోకి ప్రవేశించిన అనంతరం బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటనతో
గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చినప్పుడు
అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

