పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కలకత్తా హైకోర్టు.. వివరాలు ఇవ్వాలని ఆదేశం
కోల్కతా, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
పశ్చిమ బెంగాల్లో మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించేందుకు ప్రభుత్వం లేదా పోలీసులు ఏమైనా చర్యలు
తీసుకున్నారా? అని కలకత్తా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మతపరమైన ప్రార్థనా స్థలాల్లో
లౌడ్స్పీకర్ల తొలగింపునకు పోలీసులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై
గురువారం విచారణ సందర్భంగా ఈ ప్రశ్న వేసింది.
పోలీసులు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా మసీదులు, ఆలయాలు సహా వివిధ ప్రార్థనా స్థలాల నిర్వాహకులను
లౌడ్స్పీకర్లు తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు.
సుమారు 4 వేల మసీదుల నుంచి లౌడ్స్పీకర్లు తొలగించారని ఆయన కోర్టుకు తెలిపారు.
అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు, నిర్దిష్ట మసీదుల వివరాలు పిటిషన్లో లేవని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్
సూరజిత్ నాథ్ మిత్ర వాదించారు.
లౌడ్స్పీకర్ల నుంచి వెలువడే శబ్దం అనుమతించిన డెసిబెల్ పరిమితిని మించిందో లేదో పరిశీలించకుండానే
చర్యలు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు.
అజాన్ ఇస్లాం మతంలో ముఖ్యమైన ఆచారమని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద
మత స్వేచ్ఛకు రక్షణ ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
అయితే ప్రభుత్వం వాదనను తెలుసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
పోలీసులు నిజంగా మసీదుల నుంచి లౌడ్స్పీకర్లు తొలగించారా? అనే అంశంపై అధికారుల నుంచి వివరాలు తీసుకుని
సమాధానం ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ను ఆదేశించింది.
తదుపరి విచారణను ఆగస్టు 18కు వాయిదా వేసింది. అప్పటికి లౌడ్స్పీకర్ల తొలగింపుపై
ప్రభుత్వం అధికారిక వివరాలను కోర్టుకు సమర్పించనుంది.

