క్లాస్రూమ్లోకి వెళ్లి ఇంగ్లిష్ పాఠం బోధించిన భవేష్ మిశ్రా
నిజామాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ఎడపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కళాశాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్.. కాసేపు ఉపాధ్యాయుడి పాత్ర పోషిస్తూ విద్యార్థినులకు ఇంగ్లిష్ పాఠం బోధించారు.
విద్యార్థినులను ప్రశ్నలు అడుగుతూ పాఠ్యాంశంపై వారి అవగాహనను పరీక్షించారు. ఇంగ్లిష్పై భయం వీడి ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలని, చదువుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించిన ఆయన.. చురుగ్గా తరగతిలో పాల్గొనాలని ప్రోత్సహించారు.
అనంతరం విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
విద్యాసంస్థల తనిఖీలో భాగంగా కలెక్టర్ స్వయంగా పాఠం బోధించడం విద్యార్థినుల్లో ఉత్సాహాన్ని నింపింది.

