📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సొంతింటి కలకు ఇందిరమ్మ సర్కార్‌ చేయూత !

సొంతింటి కలకు ఇందిరమ్మ సర్కార్‌ చేయూత !

అర్హులైన పేద కుటుంబాలందరికీ దశలవారీగా ఇళ్ల మంజూరు: మంత్రి పొంగులేటి…

హనుమకొండ, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 394 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.

దశలవారీగా ఇళ్ల మంజూరు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను పేదల గడపకు చేరుస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న సుమారు 35 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశలో 4.5 లక్షలు, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేస్తున్నామని, మూడో, నాలుగో దశల్లోనూ అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇంటికి రూ.5 లక్షల సాయం

ఒక్కో ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం దశలవారీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి విడతలవారీగా నిధులు విడుదల చేస్తామన్నారు. అర్హతే ప్రాతిపదికగా ఇళ్ల మంజూరు ఉంటుందని, కులం, మతం, రాజకీయ అనుబంధంతో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు.

మౌలిక వసతుల కల్పన

లబ్ధిదారుల కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ‘‘ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇళ్లు. పేదల ముఖాల్లో ఆనందం చూడటమే మా లక్ష్యం’’ అని అన్నారు.

అంతకుముందు గూడూరు గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంత్రులు పరిశీలించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఝాన్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!