అధ్యక్షుడిగా సలాక ఆత్రేయ శర్మ ఏకగ్రీవ ఎన్నిక
బ్రాహ్మణుల ఐక్యత, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తా : సలాక ఆత్రేయ శర్మ
తూప్రాన్, జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి నవీన్ ):
తూప్రాన్ డివిజన్ బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం అధ్యక్షుడిగా తూప్రాన్ పట్టణానికి చెందిన సలాక ఆత్రేయ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సలాక రాజేశ్వర శర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంఘం మరింత బలోపేతం కావడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా కాసుల సాత్విక్ శర్మ, కోశాధికారిగా తీర్థాల రామకృష్ణ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, ఏకాభిప్రాయంతో ముగియడం పట్ల సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సలాక ఆత్రేయ శర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానని, బ్రాహ్మణుల సంక్షేమం, ఐక్యత, యువత భాగస్వామ్యం, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.
డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల బ్రాహ్మణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. విద్యార్థులకు విద్యా సహాయం, పేద బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ కార్యక్రమాలు, వేద సంస్కృతి పరిరక్షణ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘం పెద్దలు, నూతన పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

