-
పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు.
కామారెడ్డి, జూలై 17 (నవజ్యోతి ప్రతినిధి):
జిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ ఎంపీ, జిల్లా దిశా కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా దిశా కమిటీ సమావేశంలో వివిధ శాఖల పనితీరును సమీక్షించారు.

వ్యవసాయం, నీటిపారుదల, రహదారులు, రహదారి భద్రత, బ్యాంకింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, పంట బీమా తదితర కేంద్ర పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు బలోపేతం చేయడంతో పాటు తాగునీరు, సాగునీటి సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలని, తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరగా, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమావేశంలో వచ్చిన సూచనలను కార్యాచరణ ప్రణాళికతో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వై గిరి, డీఆర్డీఏ పీడీ దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

