ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఏబీవీపీ
రూ.11 వేల కోట్ల బకాయిలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో: బండారి ప్రశాంత్.
రామాయంపేట , జులై 14 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ )
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ జిల్లా రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర ఖేల్కో కన్వీనర్ బండారి ప్రశాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, అనేక మంది తమ విద్యా సర్టిఫికెట్లు కూడా పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, ఎన్నికల సమయంలో ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజులు చెల్లిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. విద్యార్థుల సమస్య కోర్టు వరకు వెళ్లడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కులేనని, వాటిని ప్రభుత్వం దయాదాక్షిణ్యంగా చూపకూడదన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిరసనలు అణిచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి ఆదర్శ్, కార్యకర్తలు హరి సింగ్, నవీన్, అరవింద్, మహేష్, భాను, చరణ్, సతీష్, పంతులు నాయక్, శివ తదితరులు పాల్గొన్నారు.

