- దేవాదాయ భూముల రశీదులపై యూరియా అందించాలని అధికారులకు ఆదేశం…
భిక్కనూర్, జూలై 12 (నవజ్యోతి ప్రతినిధి):
భిక్కనూర్ మండలంలోని గిద్ద హరిజనవాడకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ వెంటనే స్పందించారు. దేవాదాయ శాఖ భూములను కౌలుకు సాగు చేస్తున్న సుమారు 100 కుటుంబాలకు పట్టా లేదా అసైన్మెంట్ పాస్బుక్కులు లేకపోవడంతో యూరియా పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల విజ్ఞప్తిని విన్న షబ్బీర్ అలీ వెంటనే వ్యవసాయ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి, దేవాదాయ భూముల రశీదుల ఆధారంగా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో సమస్యకు తక్షణ పరిష్కారం లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పొట్టిగిని శంకర్, వార్డు సభ్యుడు పెద్దపచ్చ జ్ఞాన ప్రకాశ్ రెడ్డి, డప్పు రవి, స్థానిక నాయకులు, పాల్గొన్నారు.

