రక్షణ, ఏరోస్పేస్ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని జితేందర్రెడ్డి విజ్ఞప్తి…
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ను కేంద్ర ప్రభుత్వ రక్షణ, ఏరోస్పేస్ కారిడార్గా అధికారికంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడల వ్యవహారాల సలహాదారు ఏపీ జితేందర్రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. న్యూఢిల్లీలోని రాజ్నాథ్ సింగ్ అధికారిక నివాసంలో సోమవారం ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. ఆయన వెంట ఖమ్మం ఎంపీ రఘురామ్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఉన్న రక్షణ పారిశ్రామిక కారిడార్ల తరహాలో హైదరాబాద్–బెంగళూరు కారిడార్కు కేంద్రం అధికారిక గుర్తింపు ఇవ్వాలని జితేందర్రెడ్డి కోరారు. హైదరాబాద్ దేశంలోని ప్రధాన రక్షణ, ఏరోస్పేస్ కేంద్రాల్లో ఒకటని, 12కుపైగా రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్డీవోకు చెందిన కీలక పరిశోధనా సంస్థలు, 1,500కుపైగా ఏరోస్పేస్, రక్షణ రంగ ఎంఎస్ఎంఈలు ఉన్నాయని వివరించారు.
2025–26లో తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగ ఎగుమతులు 100 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. ప్రతిపాదిత కారిడార్తో రక్షణ ఉత్పత్తుల దేశీయ తయారీ, పరిశోధన–అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సామర్థ్య విస్తరణకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు దేశ రక్షణ సన్నద్ధతకు కారిడార్ దోహదపడుతుందని జితేందర్రెడ్డి తెలిపారు. ప్రతిపాదనను పరిశీలిస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

