బస్వాపూర్ బోనాలు, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్…
కామారెడ్డి, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ మహంకాళి మాత బోనాల ఉత్సవాలు, బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవం, ఊర పండుగ కార్యక్రమాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ మహంకాళి మాత ఆలయానికి చేరుకున్న మహమ్మద్ ఇలియాస్ ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ, మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగలు, ఊర పండుగలు ప్రజల ఐక్యతను, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.
ఇటువంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకలు గ్రామాల్లో సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు యువతకు మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు వాటిని అందించడం సమాజ కర్తవ్యమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మహమ్మద్ ఇలియాస్ను ఘనంగా సన్మానించి, కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్, ఇంద్రకరణ్ రెడ్డి, ఐరేని సందీప్, భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఐరేని నర్సయ్య, సుదర్శన్, అనంతరెడ్డి, ఆశబోయిన శ్రీనివాస్, పాత రాజు, నౌసిలాల్ నాయక్, గంప ప్రసాద్, ప్రదీప్, సర్పంచ్ పద్మ స్వామి, స్వామి, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

