న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 (నవజ్యోతి ప్రతినిధి):
భారత వాయుసేనలో అరుదైన ఘనత నమోదైంది. ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ భారత రక్షణ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా సమాన స్థాయి హోదా అందుకున్న తొలి మహిళా నాన్-మెడికల్ అధికారిగా చరిత్ర సృష్టించారు. సెప్టెంబర్ 1న ఎయిర్ హెడ్క్వార్టర్స్లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)గా బాధ్యతలు స్వీకరించారు. 0
ఆమె నియామకాన్ని భారత వాయుసేన చారిత్రక మైలురాయిగా అభివర్ణించింది. మూడు దశాబ్దాలకు పైగా సేవల అనంతరం శక్తి శర్మ సాధించిన ఈ ఘనత రక్షణ రంగంలో మహిళల నాయకత్వ ప్రస్థానానికి కొత్త అధ్యాయంగా నిలిచింది. 1
1994లో వాయుసేనలోకి..
1994 జూన్ 18న భారత వాయుసేన ఎడ్యుకేషన్ బ్రాంచ్లో కమిషన్ పొందిన శక్తి శర్మ.. శిక్షణా సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్క్వార్టర్స్, ఎయిర్ హెడ్క్వార్టర్స్లో వివిధ బాధ్యతలు నిర్వహించారు. విద్యా, శిక్షణ, సంస్థాగత వ్యవహారాల్లో విస్తృత అనుభవాన్ని సంపాదించారు. 2
ఐఐటీలు, యూనివర్సిటీలతో అనుసంధానం
వాయుసేన–అకడమిక్ రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేసే కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఐఐటీ కాన్పూర్, పుణే యూనివర్సిటీల్లో IAF Chairs of Excellence ఏర్పాటు చేయడంలో ముందుండి పనిచేశారు. అకడమిక్ రంగాన్ని వ్యూహాత్మక రక్షణ సహకారంతో అనుసంధానించడమే వీటి ఉద్దేశం. 3
సైనిక్ స్కూల్కు తొలి మహిళా కమాండర్
శక్తి శర్మ గతంలోనూ మరో చరిత్ర సృష్టించారు. త్రివిధ దళాల నుంచి సైనిక్ స్కూల్ను కమాండ్ చేసిన తొలి మహిళా అధికారిగా నిలిచారు. కపుర్తలా సైనిక్ స్కూల్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహించారు. 4
మహిళా అధికారులకు స్ఫూర్తి
ఎయిర్ వైస్ మార్షల్ స్థాయికి చేరుకున్న తొలి మహిళా నాన్-మెడికల్ అధికారిగా శక్తి శర్మ సాధించిన ఘనత.. భారత రక్షణ దళాల్లో మహిళలకు పెరుగుతున్న అవకాశాలు, నాయకత్వ బాధ్యతలకు మరో ప్రతీకగా నిలిచింది. ఆమె కొత్త బాధ్యతల్లో ఎయిర్ వాయుసేన విద్యా వ్యవహారాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. 5
మూడు దశాబ్దాల సేవకు చారిత్రక గుర్తింపు.. తొలి మహిళా నాన్-మెడికల్ ఎయిర్ వైస్ మార్షల్గా శక్తి శర్మ. వాయుసేనలో మహిళా నాయకత్వానికి మరో మైలురాయి.

