అర్పపల్లి చోరీ కేసుతో వెలుగులోకి.. పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి
జగిత్యాల జిల్లా బ్యూరో (నవజ్యోతి):
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను సారంగాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి
రిమాండ్కు తరలించారు. ఈ మేరకు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్,
సారంగాపూర్ ఎస్ఐ గీత, జగిత్యాల రూరల్ ఎస్ఐ ఉమాసాగర్
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అర్పపల్లిలో చోరీతో దర్యాప్తు
ఈ నెల 18న రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామంలో
ఓ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోని బీరువాలో
ఉన్న బంగారు గొలుసును అపహరించి, చోరీకి ఉపయోగించిన స్కూటీని అక్కడే వదిలి నిందితులు
పరారైనట్లు చెప్పారు.
ఘటనపై సారంగాపూర్ పోలీస్స్టేషన్లో క్రైం నంబర్ 109/2026
కింద కేసు నమోదు చేసి ఎస్ఐ గీత దర్యాప్తు చేపట్టారు.
అరెస్టయిన నిందితులు
- ఎనగందుల పవన్చంద్ — గుల్లపేట, జగిత్యాల రూరల్
- ఇంజనపల్లి జగదీశ్వర్ — ఎండపల్లి మండలం
- అహ్మద్ హుస్సేన్ — కరీంనగర్
- కూకట్ల సతీష్ — ర్యాకల్దేవిపల్లి, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా
- పాంచాలి సందీప్ — హన్మన్వాడ, జగిత్యాల
పోలీసులను చూసి పరారీకి యత్నం
శనివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా
రెచపల్లి ఎక్స్రోడ్డు వద్ద బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి
పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. వారిని పట్టుకుని విచారించగా దొంగతనాలకు
సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సీఐ సుధాకర్ పేర్కొన్నారు.
పలు ప్రాంతాల్లో చోరీలు
అర్పపల్లిలోని మరో ఇంటి తాళం పగులగొట్టి
రూ.350 నగదు, మూడు చైన్లు
చోరీ చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటి యజమానులు రావడంతో వారు చోరీకి ఉపయోగించిన వాహనాన్ని అక్కడే వదిలి
పరారైనట్లు చెప్పారు.
బోయినపల్లి, కొడిమ్యాల, కోనరావుపేట, జగిత్యాల రూరల్, నిజామాబాద్
తదితర ప్రాంతాల్లో కూడా నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని
సీఐ తెలిపారు. ఆయా కేసులపై మరింత దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
రిమాండ్కు తరలింపు
అరెస్టు చేసిన ఐదుగురు నిందితులపై కేసులు నమోదు చేసి, వారిని న్యాయస్థానంలో
హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ
సుధాకర్ తెలిపారు.

