సంగారెడ్డి, నవజ్యోతి న్యూస్ :
అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు..,
త్వరలో అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు..,
టీయూడబ్ల్యూజే(ఐజేయు)జిల్లా కార్యవర్గంలో తీర్మానాలు..,
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు వచ్చేవరకు నిరంతరం పోరాటం కొనసాగించాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీ యూడబ్ల్యూజే- ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ తీర్మానించింది. జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతన సదాశివపేటలో సోమవారం జిల్లా కార్యవర్గ తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు. అంతేకాకుండా వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించారు. ఇంటి స్థలం, హెల్త్ కార్డు, యూనియన్ భవనం గురించి అధికారులను ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలను సమర్పించాలని తీర్మానించినట్టు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ప్రకటించారు. సంగారెడ్డి తో పాటు , జహీరాబాద్, సదాశివపేట నారాయణఖేడ్ జోగిపేట పటాన్చెరు నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హత్నూర లో కూడా త్వరలో కమిటీ వేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలని సమావేశం నిర్ణయించింది. మిగిలిన జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. కేబుల్ టీవీ జర్నలిస్టులకు తక్షణమే ఒక యూనిట్ అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని సహించేది లేదని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా ఇతరులను కలుపుకొని పోవాలని సూచించారు. మన ఐక్యతే మన విజయానికి సూత్రం అని చెప్పారు. జర్నలిస్టుల హక్కులను సాధించడానికి రాజీ లేని పోరాటం శరణ్యమని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయంలో జర్నలిస్టులు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐక్య ఉద్యమాల ద్వారానే జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, వికాసం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. నాటి నుంచి నేటి వరకు జర్నలిస్టుల పక్షాన నికార్సుగా నిలబడి కొట్లాడుతున్న సంఘం గా టీయూడబ్ల్యూజే-ఐజే యు నిలుస్తుందని చెప్పారు. సంగారెడ్డి లో జరిగిన జిల్లా మహాసభను రాష్ట్రస్థాయిలో విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కష్టపడితే ఏదో ఒక రోజు కచ్చితంగా గుర్తింపు వస్తుందని తెలిపారు. తన అనుభవాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. జిల్లా కోశాధికారి అన్వర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆసిఫ్, ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, కోశాధికారి శ్రీధర్ జైన్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు సిద్ధిక్ ,ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ చౌహన్, ఉపాధ్యక్షుడు నజీర్, కోశాధికారి లక్ష్మణ్, రాష్ట్ర నాయకుడు బాసిత్, ఐజేయూ సభ్యుడు సిద్ధన్న పాటిల్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హాజీ, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనాథ్, మతీన్, సత్యనారాయణ రెడ్డి, కిషోర్ మల్లేశం, సంయుక్త కార్యదర్శులు ఉల్లిగడ్డల శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, సుమన్ తో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు విల్సన్, ఆంజనేయులు ఉల్వల రాజు, సదాశివపేట జర్నలిస్టులు నరేష్, విశ్వనాధ్ జయ రాములు, లింగం, జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మీనాజ్ తదితరులు పాల్గొన్నారు.

