ప్రపంచంలోనే అతిపెద్ద తట్టు వైరస్ వ్యాప్తి
అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) వెబ్సైట్లోని జాబితా ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భారీ తట్టు వైరస్ వ్యాప్తి బంగ్లాదేశ్లో కొనసాగుతోంది.
మార్చిలో వ్యాప్తి మొదలైనప్పటి నుంచి 1.66 లక్షలకు పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో 19,835 కేసులు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయ్యాయి. 999 మంది మరణించగా, వారిలో 100 మరణాలు తట్టు కారణంగానే జరిగినట్లు నిర్ధారించారు. మరో 1.46 లక్షలకు పైగా అనుమానిత రోగులు ఆసుపత్రుల్లో చేరారు.
టీకాల్లో అంతరాయమే ప్రధాన కారణమా?
2024, 2025 సంవత్సరాల్లో సాధారణ టీకా కార్యక్రమాల్లో ఏర్పడిన అంతరాయాలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. అప్పటి రాజకీయ సంక్షోభం, టీకాల సరఫరాలో సమస్యలు, కొనుగోలు విధానాల్లో మార్పులు కారణంగా అనేక మంది పిల్లలకు సమయానికి టీకాలు అందలేదని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
2024లో ఒక టీకా కార్యక్రమం వాయిదా పడటం, ఆ తర్వాతి ఏడాది దేశవ్యాప్త తట్టు–రుబెల్లా కార్యక్రమం రద్దు కావడం వల్ల రక్షణ లేని పిల్లల సంఖ్య పెరిగిందని ఆరోగ్య మంత్రి సర్దార్ ఎండీ సఖావత్ హుస్సేన్ పార్లమెంటులో వెల్లడించారు.
చిన్నారులే ఎక్కువగా ప్రభావితం
తట్టు అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధుల్లో ఒకటి. వ్యాధి వ్యాప్తి ప్రారంభ దశలో నమోదైన కేసుల్లో 80 శాతం వరకు ఐదేళ్లలోపు పిల్లలే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి.
ముఖ్యంగా తొమ్మిది నెలల లోపు శిశువులు సాధారణ టీకా వయసుకు ఇంకా రాకపోవడంతో మరింత ప్రమాదంలో ఉన్నారు. సమాజంలో టీకాల ద్వారా ఏర్పడే రక్షణ తగ్గినప్పుడు వైరస్ వివిధ వయసుల మధ్య వేగంగా వ్యాపించే అవకాశం పెరుగుతోంది.
ఏళ్ల పురోగతికి ఒక్కసారిగా ఎదురుదెబ్బ
గత దశాబ్దంలో బంగ్లాదేశ్ తట్టు టీకా కార్యక్రమంలో గణనీయమైన పురోగతి సాధించింది. కొవిడ్ మహమ్మారి సమయంలో వచ్చిన తగ్గుదల మినహా చాలా సంవత్సరాల్లో టీకా కవరేజీ 95 శాతానికి సమీపంలో లేదా అంతకంటే ఎక్కువగా కొనసాగింది.
అయితే 2024, 2025లో ఏర్పడిన టీకా అంతరాయాలు ఆ పురోగతిని దెబ్బతీశాయని అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ మహ్ముదూర్ రెహ్మాన్ తెలిపారు. టీకా కవరేజీ పెంచడం, రక్షణ లోటును పూడ్చడం, ప్రజల్లో అవగాహన పెంచడం తక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఆసుపత్రుల్లో నేలపైనే చికిత్స
తట్టు కేసులతో పాటు డెంగ్యూ రోగులు కూడా పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో వైద్య వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు 45,000 మందికి పైగా డెంగ్యూ రోగులు ఆసుపత్రుల్లో చేరారు.
ఢాకాలోని షహీద్ సుహ్రావర్ది మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో తట్టు రోగుల కోసం 60 పడకలు ఉన్నప్పటికీ.. అనేక మంది నేలపైనే చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 1,350 మంది సామర్థ్యం ఉన్న ఆసుపత్రిలో ప్రస్తుతం 2,350 మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.
టీకా లభించకపోవడంతోనే వ్యాధి?
ఒకవైపు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఆసుపత్రుల్లో పడకలు దొరకడం కష్టంగా మారగా.. మరోవైపు టీకాల లభ్యత కూడా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసింది. ఓ మహిళ తన 13 నెలల కుమారుడికి అనారోగ్యం కారణంగా టీకా వేయలేకపోయామని, తర్వాత టీకా కేంద్రానికి వెళ్లినప్పుడు టీకా అందుబాటులో లేదని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది.
మరో కుటుంబం ఎనిమిది నెలల చిన్నారికి తట్టు లక్షణాలు కనిపించడంతో ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తిరగాల్సి వచ్చిందని తెలిపింది. సరైన సమాచారం కోసం కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
1.97 కోట్ల మంది పిల్లలకు టీకాలు
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ఏప్రిల్లో అత్యవసర తట్టు–రుబెల్లా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆరు నెలల నుంచి ఐదేళ్లలోపు సుమారు 1.8 కోట్ల మంది పిల్లలను లక్ష్యంగా పెట్టుకుంది.
ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 1.97 కోట్లకు పైగా పిల్లలకు టీకాలు వేశారు. అయితే గతంలో ఏర్పడిన రక్షణ లోటును పూర్తిగా పూడ్చేందుకు సాధారణ టీకా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిరోధించగల వ్యాధి.. వేల కుటుంబాల్లో విషాదం
జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపించే తట్టును రెండు మోతాదుల టీకాతో సమర్థంగా నిరోధించవచ్చు. అయినప్పటికీ టీకా కార్యక్రమాల్లో ఏర్పడే చిన్న అంతరాయం కూడా భారీ స్థాయిలో వ్యాధి వ్యాప్తికి దారితీయగలదని బంగ్లాదేశ్ పరిస్థితి స్పష్టం చేస్తోంది.
తట్టుతో పాటు డెంగ్యూ కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో.. టీకా వ్యవస్థను పటిష్టం చేయడం, ఆసుపత్రుల సామర్థ్యాన్ని పెంచడం, పిల్లలకు సకాలంలో చికిత్స అందించడం బంగ్లాదేశ్ ముందున్న తక్షణ సవాళ్లుగా మారాయి.

