📄 ePaper
Thursday, September 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రోడ్డు ఉంది.. కానీ నడవలేని పరిస్థితి!

రోడ్డు ఉంది.. కానీ నడవలేని పరిస్థితి!

మురుగులోనే నడక.. దుర్వాసనలోనే జీవనం!
డ్రైనేజీ సమస్య కాదు.. అధికారుల నిర్లక్ష్యానికి ఇదే సజీవ సాక్ష్యం!

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 8 (నవజ్యోతి ప్రతినిధి):

అభివృద్ధి వేగంగా జరుగుతున్నా.. ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలకు రామ్‌రెడ్డి నగర్‌లోని పరిస్థితి అద్దం పడుతోంది. రోడ్డు ఉన్నా నడవలేని పరిస్థితి.. డ్రైనేజీ నీటిలోనే నడవాల్సిన దుస్థితి. గత నెల రోజులుగా రోడ్డుపై మురుగు నీరు ఏరులై పారుతున్నా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు కాదు.. మురుగు కాలువలా మారింది!

కొంపల్లి సర్కిల్‌ పరిధిలోని రామ్‌రెడ్డి నగర్‌లో విజన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ, హెచ్‌.నెం. 5-36/8/6 సమీపంలోని రహదారి ప్రస్తుతం మురుగు నీటితో నిండిపోతోంది. గత నెల రోజులుగా డ్రైనేజీ నీరు నిరంతరం రోడ్డుపైనే పారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు మురుగు నీరు తప్పడం లేదు. రోడ్డు దాటాలంటే డ్రైనేజీలోనే అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాహనం వెళ్తే.. మురుగు చిమ్మాల్సిందే!

రోడ్డుపై పారుతున్న మురుగు నీటితో స్థానికుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాహనాలు పక్క నుంచి వెళ్లిన ప్రతిసారీ మురుగు నీరు ఒంటిపై చిమ్మడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఈ మార్గంలో నడవాలంటేనే వెనుకంజ వేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రజల కోసం ఉందా? లేక మురుగు పారించేందుకా?

దుర్వాసన.. దోమల బెడద.. ప్రజారోగ్యంపై భయం!

రోజుల తరబడి మురుగు నీరు రోడ్డుపైనే పారుతుండటంతో పరిసరాల్లో దుర్వాసన, దోమల బెడద పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఇది కేవలం డ్రైనేజీ సమస్య కాదని.. ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.

నెల రోజులుగా ఇదే దుస్థితి.. అధికారులు ఎక్కడ?

నెల రోజులుగా రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తున్నా సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

“నెల రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించే తీరిక అధికారులకు లేదా? ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాతే స్పందిస్తారా?” అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

సమస్య ఎక్కడ?.. పరిష్కారం ఎప్పుడు?

అసలు డ్రైనేజీ లీకేజీ ఎక్కడి నుంచి వస్తోంది? రోడ్డుపైకి మురుగు నీరు ఎందుకు వస్తోంది? సమస్యకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదు? తాత్కాలిక చర్యలకే అధికారులు పరిమితమవుతున్నారా? అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.

సమస్య మూలాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపకుండా కేవలం మురుగు తొలగింపుతో సరిపెడితే మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా?

రోడ్డుపై మురుగు నీరు పారుతున్న దృశ్యం కేవలం పారిశుద్ధ్య సమస్యను మాత్రమే చూపించడం లేదు.. ప్రజల సమస్యలపై అధికారుల స్పందన ఎలా ఉందన్న దానినీ ప్రశ్నిస్తోంది.

ఇప్పటికైనా సంబంధిత హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ అధికారులు రామ్‌రెడ్డి నగర్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, లీకేజీకి కారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రశ్న ఒక్కటే..

“రోడ్డు ఉన్నప్పుడు.. మురుగులోనే ఎందుకు నడవాలి? సమస్య కనిపిస్తున్నప్పుడు.. అధికారులు స్పందించడానికి ఇంకెంతకాలం?”

— నవజ్యోతి ప్రతినిధి నవీన్‌
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!