స్కూటీపై ఐదుగురు మైనర్లు.. వీడియో వైరల్తో కేసు
హైదరాబాద్, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రతినిధి):
మైనర్ చేతికి స్కూటీ ఇచ్చిన ఓ డాక్టర్కు పోలీసుల కేసు తప్పలేదు. స్కూటీపై ఒకరు డ్రైవింగ్ చేస్తుండగా.. మరో నలుగురు మైనర్లు వెనుక కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో వైరల్ కావడంతో ఖైరతాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
స్కూటీపై ఐదుగురు మైనర్లు
ఆగస్టు 18న సాయంత్రం 4.30 గంటల సమయంలో లక్డీకాపూల్లోని షా గౌస్ రెస్టారెంట్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 16 ఏళ్ల ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి హోండా యాక్టివాను నడపగా.. 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న మరో నలుగురు మైనర్లు వెనుక కూర్చున్నారు. ఐదుగురూ ఒకే స్కూటీపై దూసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘స్కూటీ ఇచ్చింది’ డాక్టర్.. కేసు కూడా ఆమెపైనే!
వాహనం మల్లేపల్లికి చెందిన 30 ఏళ్ల డాక్టర్ రొమానా ఫర్నాజ్ పేరుతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మైనర్కు వాహనం ఇచ్చినందుకు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. సైఫాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ కె. నర్సింహులు గౌడ్కు ఆగస్టు 19న ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
మైనర్ డ్రైవింగ్, ఒకేసారి నలుగురు పిలియన్ ప్రయాణికులను ఎక్కించుకోవడం, ప్రమాదకరంగా వాహనం నడపడం వంటి అంశాలపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్లతో పాటు మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
పిల్లలు ‘స్కూటీపై సరదా’ అనుకున్నారు.. కానీ వైరల్ వీడియో చివరకు వాహనం యజమానికి పోలీస్ కేసుగా మారింది.

