📄 ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మెఫెంథెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం.. ముగ్గురి అరెస్ట్ !

మెఫెంథెర్మిన్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయం.. ముగ్గురి అరెస్ట్ !

హైదరాబాద్, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):

మెఫెంథెర్మిన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న ముగ్గురిని రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటలో విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

110 మెఫెంథెర్మిన్ ఇంజెక్షన్ వైయల్స్, 25 సిరంజిలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు.

ఇలా బయటపడింది..

ప్రధాన నిందితుడు మహమ్మద్ జుబేర్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా తక్కువ ధరకు ఇంజెక్షన్లు తెప్పించుకుని, థర్డ్‌పార్టీ కొరియర్ ద్వారా వాటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుమారు రూ.5 వేలతో 30 ఇంజెక్షన్ల ప్యాక్ కొనుగోలు చేసి, ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.1,000కు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

జుబేర్ సూచనల మేరకు మహమ్మద్ సైఫ్ ఖాన్ ఇంజెక్షన్లు సరఫరా చేయగా.. మహమ్మద్ ఐజాజ్ వాటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ముగ్గురు నిందితులు

మహమ్మద్ ఐజాజ్ (23) ఫలక్‌నుమా నవాబ్‌సాహెబ్ కుంటకు చెందినవాడు. చార్మినార్‌లోని దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతడిపై గతంలో సంతోష్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి, బహదూర్‌పురా, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మహమ్మద్ జుబేర్ అలియాస్ జుబేర్ (30) మోడలింగ్ చేస్తున్నాడు. ఇతడిపై గతంలో ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.

మహమ్మద్ సైఫ్ ఖాన్ (20) కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురూ నవాబ్‌సాహెబ్ కుంట, ఫలక్‌నుమా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.

రాజస్థాన్‌కు చెందిన శుభమ్ రాజ్‌పుత్ ప్రధాన సరఫరాదారుగా ఉన్నట్లు గుర్తించారు. అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు

ఈ ఘటనపై ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 425/2026 కింద BNS సెక్షన్లు 318(4), 278, 152 R/W 3(5), డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ సెక్షన్ 18(C) R/W 27(b)(ii) కింద కేసు నమోదు చేశారు.

టాస్క్‌ఫోర్స్‌కు సీపీ అభినందనలు

రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల అదనపు డీసీపీ కె.ఎస్. రావు పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రవి, ఎస్‌ఐ ధర్మేష్, పీసీ కృష్ణగౌడ్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు. నిందితులను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని హైదరాబాద్ సీపీ అభినందించారు.

నిషేధిత మందులు లేదా మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!