కాలుష్య నియంత్రణ, వరద ముప్పు తగ్గింపు, పక్షుల ఆవాసాలు.. కట్టల బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక..
హైదరాబాద్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి):
హైదరాబాద్లోని చెరువుల పునరుద్ధరణకు నిపుణ సంస్థలను నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అనుమతి ఇచ్చింది. మున్సిపల్ పరిపాలన శాఖ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులతో జాతీయ స్థాయి సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు మార్గం సుగమమైంది. పర్యావరణానికి ఎలాంటి నష్టం కలగకుండా శాస్త్రీయ, పర్యావరణహిత పద్ధతుల్లో చెరువులను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చెరువుల పునరుద్ధరణలో నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. కేవలం పూడికతీతకే పరిమితం కాకుండా సమగ్ర పునరుజ్జీవన ప్రణాళిక అమలు చేయనున్నారు.
చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతం, మురుగునీరు చెరువుల్లోకి చేరకుండా ట్రీట్మెంట్ పాండ్ల నిర్మాణం, వరద నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. అలాగే చెరువుల్లో దీవుల అభివృద్ధి, పక్షుల ఆవాసాల ఏర్పాటు, చుట్టుపక్కల పెద్ద ఎత్తున పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకోనున్నారు.
దీంతో నీటి నాణ్యత మెరుగుపడటంతో పాటు వరద ముప్పు తగ్గి జీవవైవిధ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన ఇంజినీరింగ్ విధానాలతో చెరువులను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
జాతీయ స్థాయి టెండర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చెరువుల పునరుద్ధరణలో అనుభవం ఉన్న సంస్థలు పోటీపడే అవకాశం ఉంది. శాస్త్రీయ ప్రణాళిక, పర్యావరణహిత ఇంజినీరింగ్ విధానాలతో హైదరాబాద్ చెరువులను పునరుద్ధరించేందుకు ఈ చర్య దోహదపడనుంది.

