📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడం హోదా !

పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడం హోదా !

కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన.. ఏఎస్‌ఐ గెజిట్‌లో ప్రచురణ

ములుగు, సెప్టెంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న చారిత్రక ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) ఈ ప్రకటనను జారీ చేసింది.

ఏఎస్‌ఐ గెజిట్‌లో అధికారిక ప్రకటన

31.08.2026 నాటి ప్రకటన నం. ఎస్‌.ఒ.4802(ఇ) ‘గెజిట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రత్యేక సంచికలో పార్ట్‌–II, సెక్షన్‌–3, ఉప సెక్షన్‌ (ii) కింద ప్రచురితమైంది. ‘ప్రాచీన కట్టడాలు–పురావస్తు ప్రదేశాలు–అవశేషాల చట్టం–1958’లోని సెక్షన్‌ 4, ఉప సెక్షన్‌ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ఏఎస్‌ఐ ఈ ప్రకటన జారీ చేసింది.

రామప్ప ఆలయానికి సమీపంలోనే

పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ‘కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయ నిర్మాణం, శిల్పాలంకరణ ప్రత్యేకతను సంతరించుకుంది.

త్రికూటాలయంగా గొల్లల గుడి

తూర్పు ముఖంగా ఉన్న మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా గొల్లల గుడి కనిపిస్తుంది. ఆలయ ప్రహరీ శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుస, సునిశిత రంధ్రాల వల పనితనం ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

శిల్పాలతో అలరారుతున్న ఉప ఆలయాలు

ప్రధాన ఆలయానికి ముందు భాగంలో రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఇవి అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. ఉప ఆలయాల ముందు ఉన్న అంతరాలయాల అంచులు కూడా చక్కటి తెరలతో శోభాయమానంగా కనిపిస్తాయి.

మూడు గర్భాలయాలు.. విశిష్ట నిర్మాణం

ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగంలోని మండపం గుండా మధ్యలో ఉన్న ప్రధాన మందిరానికి మార్గం ఉంటుంది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశల్లో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై ఉన్న వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి.

కాకతీయ శిల్పకళకు మరో మణిహారం

జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై గొల్లల గుడి నిర్మితమైంది. ఆలయంలోని నిర్మాణ శైలి, శిల్పాలు, అలంకరణలు నాటి శిల్పకారుల కళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

జాతీయ గుర్తింపుతో ప్రాధాన్యం

పాలంపేటలోని గొల్లల గుడికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్య కట్టడంగా అధికారిక గుర్తింపు ఇవ్వడంతో చారిత్రక కాకతీయ శిల్ప సంపదకు మరింత ప్రాధాన్యం లభించింది. ఏఎస్‌ఐ అధికారిక గెజిట్‌ ప్రకటనతో ఈ గుర్తింపు చట్టబద్ధంగా నమోదైంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!