📄 ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సౌండ్‌ బాక్స్‌లో గంజాయి.. గ్యాంగ్‌ గుట్టురట్టు!

సౌండ్‌ బాక్స్‌లో గంజాయి.. గ్యాంగ్‌ గుట్టురట్టు!

ఆటోలో తరలిస్తుండగా ఐదుగురు డ్రగ్‌ పెడ్లెర్లు అరెస్ట్.. 6 కిలోలు స్వాధీనం
హైదరాబాద్, ఆగస్టు 17 (నవజ్యోతి ప్రతినిధి):

ఆటోలోని సౌండ్‌ బాక్స్‌ను గంజాయి దాచేందుకు అడ్డాగా మార్చుకున్న ముఠా గుట్టును ఈగల్‌ ఫోర్స్‌, పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. నాగ్‌పూర్‌ నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న ఐదుగురు పెడ్లర్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గంజాయిని ఆటో సౌండ్‌ బాక్స్‌లో దాచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

నాగ్‌పూర్‌ వెళ్లి.. సరుకు తీసుకొచ్చి

విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు మహ్మద్‌ హమీద్‌తో పాటు మరో నలుగురు నాగ్‌పూర్‌కు వెళ్లి తాజుద్దీన్‌ దర్గా సమీపంలో సప్లయర్‌ షేక్‌ సాదిక్‌ నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

6 కిలోల గంజాయి కోసం సుమారు రూ.1 లక్ష చెల్లించినట్లు విచారణలో వెల్లడైంది.

గంజాయి తీసుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా జివికే ఈఎంఆర్‌ఐ సమీపంలో ఆటోను పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. సౌండ్‌ బాక్స్‌లో దాచిన గంజాయిని గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఐదుగురు అరెస్ట్‌.. సప్లయర్‌ పరారీ

ఈ కేసులో మహ్మద్‌ హమీద్‌, మహ్మద్‌ అబ్బాస్‌, మహ్మద్‌ ముస్తఫా, ఇర్ఫాన్‌ ఖాన్‌, సయ్యద్‌ అఫ్రోజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన సప్లయర్‌ షేక్‌ సాదిక్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ప్రధాన నిందితుడు మహ్మద్‌ హమీద్‌పై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2024లో బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎక్స్‌టార్షన్‌, ఆర్మ్స్‌ యాక్ట్‌ కేసులో అతడు అరెస్టయినట్లు తెలిపారు.

రైల్వే స్టేషన్‌.. దర్గా.. పబ్లిక్‌ గార్డెన్స్‌

నాంపల్లి రైల్వే స్టేషన్‌, నాంపల్లి దర్గా, పబ్లిక్‌ గార్డెన్స్‌ పరిసరాలను గంజాయి విక్రయాలకు కేంద్రాలుగా ఉపయోగించినట్లు విచారణలో తేలింది. ఆటో డ్రైవర్లు, రోజువారీ కూలీలు, క్యాబ్‌ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

హమీద్‌కు సంబంధించి 25 మందికి పైగా రెగ్యులర్‌ గంజాయి వినియోగదారులను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.

సరఫరా నెట్‌వర్క్‌పై నజర్‌

పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు సాగుతున్న గంజాయి సరఫరా నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

పరారీలో ఉన్న సప్లయర్‌ షేక్‌ సాదిక్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. ముఠా వెనుక ఉన్న మరిన్ని లింకులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఆటోలో ప్రయాణికుల్లా వచ్చారు..
సౌండ్‌ బాక్స్‌లో గంజాయి దాచారు..పోలీసుల తనిఖీతో గ్యాంగ్‌ గుట్టు రట్టయింది!

6 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్‌..
ఇంకెంత పెద్ద నెట్‌వర్క్‌ ఉందో దర్యాప్తులో తేలాల్సిందే.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!